నల్లగొండ ప్రతినిధి, జనవరి 17(నమస్తే తెలంగాణ): ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ ప్రకటించి ఆ వెంటనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్-2 పరీక్షను కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోటీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. రాబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించి త్వరలోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులతోపాటు తులం బంగారం కూడా అందజేస్తామని వెల్లడించారు. బుధవారం నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇకనుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులతోపాటు పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ పథకాల్లో అధికారులే అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తారని చెప్పారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడానికి స్థలాలను గుర్తిస్తామని తెలిపారు.