Medigadda Barrage | హైదరాబాద్, మార్చి 3(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగుబాటునకు ప్రధానంగా అంతర్గత నీటి ప్రవాహమే (అండర్ పైపింగ్) కారణమని తెలిసింది. పిల్లర్ వద్ద వేసిన సెకంట్పైల్స్లో రెండుచోట్ల ఏర్పడిన లోపం వల్లే నీటి ప్రవాహం కొనసాగి పిల్లర్ కింది భాగంలో ఇసుకను తోడేసిందని ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తేలినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకు సంబంధించిన నివేదికను వారం క్రితమే సిద్ధం చేసిన సదరు ఏజెన్సీ దానిని ప్రభుత్వానికి నివేదించేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తున్నది. ఏజెన్సీ నుంచి నివేదికను తెప్పించుకోవడంతోపాటు తదుపరి పరీక్షలను నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నది.
పూర్తయిన ఈఆర్టీ, జీపీఆర్ టెస్ట్లు
20వ పిల్లర్ కుంగుబాటుకు కారణాలపై ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను నిర్మాణ ఏజెన్సీ ఎల్అండ్టీనే చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత విద్యుత్తు నిరోధకత ఆధారంగా భూగర్భ పరీక్షలను నిర్వహించే ఈఆర్టీ (ఎలక్ట్రోడ్ రెసిస్టివిటి టెస్ట్)ను చేపట్టింది. విద్యుత్తు ప్రవాహం అన్ని పదార్థాల్లో ఒకే విధంగా ఉండదు. ఇసుకలో, నీళ్లలో, ఒక్కో తీరుగా, ఒక్కో వేగంతో ప్రవహిస్తుంది. కొన్ని మూలకాల గుండా విద్యుత్తు అసలే ప్రవహించదు. కొన్నింటి ద్వారా వేగంగా, కొన్నింటి ద్వారా నిదానంగా ప్రవహిస్తుంది.
ఇలా విద్యుత్తు ప్రవాహాన్ని బట్టి భూగర్భంలో ఎలాంటి పదార్థమున్నది తెలుసుకోవచ్చు. అదే పద్ధతిని అనుసరించి బరాజ్ ఫౌండేషన్ను అధికారులు పరీక్షించారు. అదేవిధంగా భూగర్భ భౌతిక స్థితిని తెలుసుకునేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్టెస్ట్ (జీపీఆర్)ను నిర్వహించారు. భూగర్భంలో ఉన్న వివిధ మట్టి పొరలు, పదార్థాల లక్షణాలు, సంభవించిన మార్పులు, పగుళ్లు, శూన్యాలను తెలుసుకొనేందుకు దీనిని నిర్వహిస్తారు. ప్రస్తుతం 7వ బ్లాక్లో ఈ రెండు టెస్ట్లను పూర్తిచేశారు. 6వ బ్లాక్లోనూ చేపట్టేందుకు నిర్మాణ ఏజెన్సీ సిద్ధమైంది.
నివేదికను ఇచ్చేందుకు ససేమిరా!
7వ బ్లాక్కు సంబంధించి ఈఆర్టీ, జీపీఆర్ టెస్ట్లను నిర్వహించడమే గాక అందుకు సంబంధించిన నివేదికను సైతం బరాజ్ నిర్మాణ ఏజెన్సీ ఎల్అండ్టీ సిద్ధం చేసిందని విశ్వసనీయ సమాచారం. బరాజ్లోని పిల్లర్ కుంగుబాటునకు ప్రధానంగా పిల్లర్ దిగువన ఇసుక పూర్తిగా కదిలిపోవడమే కారణమని నిర్ధారించినట్టు తెలిసింది. సాధారణంగా అంతర్గత జల ప్రవాహం వల్ల బరాజ్ ఫౌండేషన్ కింద ఉన్న మట్టి కొట్టుకుపోకుండా ఉండేందుకు సెకంట్పైల్స్ను రక్షణగా ఏర్పాటుచేస్తారు.
అంతర్గత జల ప్రవాహాన్ని దారి మళ్లిస్తారు. సెకంట్పైల్స్ను నిట్టనిలువుగా అమర్చాల్సి ఉంటుంది. అయితే 7వ బ్లాక్ 20వ పిల్లర్ వద్ద ఏర్పాటుచేసిన పలు సెకంట్పైల్స్లో వాటిల్లిన లోపం వల్లేనే నీటి ప్రవాహం ఫౌండేషన్ కిందుగా కొనసాగి, ఇసుకను, మట్టిని తోడేసిందని, తద్వారా ఖాళీ ఏర్పడి పిల్లర్ కుంగుబాటునకు గురైందని సమాచారం. ఈఆర్టీ, జీపీఆర్ టెస్ట్లో అదే నిర్ధారణకు వచ్చిందని తెలుస్తున్నది.
అయితే అందుకు సంబంధించిన నివేదికను సదరు నిర్మాణ ఏజెన్సీ ఇప్పటికీ ప్రభుత్వానికి ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఫౌండేషన్లో అంతర్గతంగా నీటి ప్రవాహం కొనసాగడం వల్ల పిల్లర్ కుంగుబాటుకు గురైన నేపథ్యంలో 7వ బ్లాక్కు సంబంధించిన ఫౌండేషన్ను పూర్తిగా పరీక్షించాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్గతంగా వాటర్ పైపింగ్ ఎక్కడి నుంచి మొదలై, ఎక్కడికి వెళ్తున్నది గుర్తించాల్సి ఉన్నదని అధికారులు, నిపుణులు చెప్తున్నారు. అందుకు 7వ బ్లాక్ ఫౌండేషన్ను పూర్తిగా ఓపెన్ చేసి పరీక్షించాల్సి ఉంటుందని స్పష్టంచేస్తున్నారు.