బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అసాంక్రమిద వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రత్యేక మెడికల్ కిట్ల్ల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు ఆర్థిక భారాన్ని, దవాఖానల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించేందుకు కొత్త ఆలోచన చేస్తున్నది.
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ప్రసవ సమయంలో మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ కిట్ల పథకానికి ఇప్పటికే అద్భుత స్పందన వస్తున్నది. ఇలాంటి కిట్లనే దీర్ఘకాలిక రోగులకు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. ఈ కిట్లు ఎలా ఉండాలనేదానిపై ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు, అమలు సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నారు. కిట్ల పంపిణీ ప్రారంభమైతే రాష్ట్రంలోని 25 లక్షల పైచిలుకు బీపీ, షుగర్, క్యాన్సర్ బాధితులకు ఎంతో ఊరట కలుగుతుందని అధికారులు అంటున్నారు.
తొలుత పది లక్షల కిట్లు
రాష్ట్రంలో 30 ఏండ్లు పైబడినవారికి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (అసాంక్రమిక వ్యాధులు) కార్యక్రమం కింద అన్ని జిల్లాల్లో బీపీ, షుగర్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో గతేడాది వరకు 25 లక్షల మందికి బీపీ, షుగర్ ఉన్నట్టు గుర్తించారు. వీరికి స్థానిక పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో మందులు ఇస్తున్నారు. అత్యవసర సమయాల్లో పెద్ద దవాఖానలకు పంపిస్తున్నారు. దీన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు మెడికల్ కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తొలిదశలో పది లక్షల కిట్లు సిద్ధం చేయాలని ప్రభుత్వానికి అధికారులు నివేందించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఎన్సీడీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. దీన్ని కలుపుకొని ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు.
ఒకేసారి నెలకు సరిపడా మందులు
నాన్ కమ్యూనబుల్ డిసీజ్ కిట్లను కేసీఆర్ కిట్ల వలే ప్రత్యేక ఆకర్షణతో డిజైన్ చేస్తున్నారు. ఇందులో మందులతో పాటు, వాటిని వినియోగించే తీరును వివరించే సమాచార పత్రాలు ఉంటాయి. ఒక్కో కిట్లో షుగర్, బీపీ, క్యాన్సర్ తదితర రోగాలకు సంబంధించిన నెలకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుతారు. నిరక్షర్యాసులు సైతం సులువుగా తెలుసుకొనేలా కిట్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేసి మందులను వేరుగా ఉంచుతారు. వృద్ధులకు అనుకూలంగా ఉండేలా వీటిని ఒక బ్యాగు రూపంలో అందించనున్నారు. రోగులకు ఆర్థికభారం లేకుండా నెలనెలా మందులను కిట్ల రూపంలో అందించబోతున్నారు.