హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నియామకాల జాతర కొనసాగుతున్నది. వైద్యారోగ్య శాఖలో 5,204 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (డీపీహెచ్ అండ్ హెచ్డబ్ల్యూ) పరిధిలో 3,823 పోస్టులు ఉన్నాయి. వీటికి జనవరి 25వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు ఇచ్చారు. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్ (ఎంఎన్జేఐవో అండ్ ఆర్సీసీ)లోని 81 పోస్టులు మినహా మిగతావన్నీ జోనల్ పోస్టులు.
వైద్య ఆరోగ్య శాఖలో 10 వేలకుపైగా పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా నోటిఫికేషన్తో వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటివరకు 7,320 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తయింది. నోటిఫికేషన్ విడుదలైన ఆరు నెలల్లోనే రిక్రూట్మెంట్ పూర్తిచేశారు.
రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా 5,402 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్తో వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 7,320 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. ఇందులో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియ పూర్తయింది.
-హరీశ్రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి