బండ్లగూడ, సెప్టెంబర్ 22: కంటి వైద్య చికిత్సకు అవసరమైన పరికరాలను తయారు చేసేందుకు ముందుకొచ్చే వారి కోసం ఒక ప్రత్యేక క్లస్టర్ను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. సుల్తాన్పూర్లోని మెడికల్ డివైసెస్ పార్క్లో క్లస్టర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని కిస్మత్పూర్లో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో పూర్ణిమ-రామం ఆత్మకూరి టెక్నాలజీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి వైద్య సంస్థలు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయని, కానీ.. 80% వైద్య పరికరాలను విదేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశంలోనే వాటి ఉత్పత్తి జరుగాలని ఆకాంక్షించారు. సుల్తాన్పూర్లో ఉన్నది రాష్ట్రంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ పార్కు అని చెప్పారు. ఈ పార్కులో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇప్పటికే 28 సంస్థలు ముందుకొచ్చాయని వెల్లడించారు. తమ ప్రభుత్వం మూడేండ్ల కిందటే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్ర ప్రజలందరికీ కండ్ల పరీక్షలు చేసిందని గుర్తు చేశారు. ఆ సమయంలో అవసరమైనవారందరికీ ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసిందని తెలిపారు. కంటి చికిత్సకు అవసరమైన పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చిందని అన్నారు. ఆ పరికరాలను ఇక్కడే తయారు చేసేందుకు ముందుకొచ్చేవారి కోసం ఓ క్లస్టర్ను ఏర్పాటుచేసేందుకు సిద్ధమని వెల్లడించారు. ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో కొత్తగా ఏర్పాటుచేసిన కేంద్రంలో విడిభాగాలను ఆయన పరిశీలించారు. ఎల్వీ ప్రసాద్ సంస్థ 1987లో స్థాపించిన నాటి నుంచి సమాజానికి ఎన్నో సేవలందించిందని ప్రశంసించారు. ప్రజలకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు ఆ సంస్థ 2013లో సాంకేతికతపై దృష్టి సారించిందని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో సెంటర్ ఫర్ సైట్ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రంజిత్రెడ్డికి మంత్రి కేటీఆర్ సూచించారు. తద్వారా పిల్లల్లో కంటిచూపు సమస్యలు రాకుండా నివారించవచ్చని అన్నారు. దీనిపై స్పందించిన రంజిత్రెడ్డి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎల్వీ ప్రసాద్ సంస్థ వ్యవస్థాపకుడు జీఎన్ రావు, స్థానిక మేయర్ మహేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.