హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఇప్పటివరకు 25 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మిగతా 8 జిల్లాల్లోనూ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తద్వారా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పాన్ని పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 8 జిల్లాలో వచ్చే ఏడాది మెడికల్ కాలేజీలు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. అతి తకువ సమయంలో 21 కాలేజీలు ప్రారంభించి దేశంలోనే రికార్డు సృష్టించామని పేర్కొన్నారు.
నంబర్ వన్గా ఎదగాలి
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేందుకు, ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు మరింత మెరుగ్గా, బాధ్యతగా సేవలు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలంగాణ పనితీరు అద్భుతంగా ఉన్నదని, అగ్రస్థానంలో రాష్ట్రం నిలిచిందని చెప్పారు. సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు ఆరోగ్య రంగంలో తెలంగాణ నంబర్ వన్గా నిలవాలని ఆకాంక్షించారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో విశాలాచ్చి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
24 జిల్లాల్లో స్క్రీనింగ్ పూర్తి
కంటివెలుగు కార్యక్రమంలో శుక్రవారం నాటికి 99 పనిదినాల్లో 1.61 కోట్ల మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. ఇందులో 40.59 లక్షల మందికి దృష్టి సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. వారికి రీడింగ్/ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అందజేశారు. ఇప్పటివరకు మొత్తం 24 జిల్లాల్లో స్క్రీనింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మారిన జీవనవిధానం, వివిధ రకాల పని ఒత్తిళ్ల వల్ల కంటి సమస్యలపై ప్రజలు దృష్టి పెట్టడంలేదని చెప్పారు. నిర్లక్ష్యానికి అవగాహనలోపం తోడవటంతో చాలా మంది తీవ్ర దృష్టి సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్ రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. కంటివెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్యసిబ్బందికి అభినందనలు తెలిపారు. సహకరిస్తున్న ఇతర శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 24 జిల్లాల్లో వంద శాతం స్క్రీనింగ్ పూర్తయిందని, మిగతా జిల్లాల్లో పరీక్షలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
99 రోజుల్లో కంటివెలుగు ప్రగతి
కంటి పరీక్షలు : 1.61 కోట్లు
దృష్టిలోపం ఉన్నవారు: 40.59 లక్షలు
రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 22.51 లక్షలు
ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ: 18.08 లక్షలు