కొత్తగూడెం సింగరేణి/గోదావరిఖని, సెప్టెంబర్ 1 : సింగరేణిలో ప్రతి నెలా క్రమం తప్పకుండా మెడికల్ బోర్డులు నిర్వహించి, అనారోగ్యంతో దరఖాస్తు చేసుకున్న కార్మికులను అన్ఫిట్ చేయాలని మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే-1, 2, 2ఏ, ఓసీ 5, జీడీకే 11 ఇైంక్లెన్, ఏరియా వర్క్షాప్, సివిల్ డిపార్ట్మెంట్, అనలాటికల్ ల్యాబ్, ఆర్జీ-2, 3 ఏరియాల్లో కార్మికులు, ఎస్పీసీ విభాగంలో నల్ల బ్యాడ్జీలు ధరించారు. అనంతరం హెచ్వోడీలకు వినతిపత్రాలను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్డాఫీసు పరిధిలోని సెంట్రల్, మెయిన్ వర్క్షాపుల్లో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో రద్దు చేసిన డిపెండెంట్ ఉద్యోగాల స్థానంలో కేసీఆర్ హయాంలో కారుణ్య నియామకాలు ప్రవేశపెట్టారని, 13వేల కార్మికుల మెడికల్ ఇన్వాలిడేట్ జరిగిందని, ఫలితంగా వేలాది కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగిందన్నారు. వందశాతం మెడికల్ అన్ఫిట్ చేయిస్తామని, ప్రతినెలా కనీసం మూడు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని కాంగ్రెస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ హామీలు ఇచ్చి ఆచరణలో 10 శాతానికి మించి చేయడంలేదని ధ్వజమెత్తారు. ఆయా కార్యక్రమాల్లో ఏరియా ఉపాధ్యక్షుడు తుమ్మ శ్రీనివాస్రావు, సంఘ నాయకులు కంచర్ల శ్రీనివాస్, ప్రసాద్, రవివర్మ, సూర్యనారాయణ, అమరేందర్ పాల్గొన్నారు.