Photo Journalist | హైదరాబాద్ : యువ ఫొటో జర్నలిస్ట్ నర్రా రాజేష్ ఆకస్మిక మరణం అత్యంత విషాదకరమని, అతని కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం నాడు బషీర్బాగ్లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజేష్ సంస్మరణ సభ నిర్వహించారు. అసోసియేషన్ నుండి బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
ఆయా పత్రికల్లో ఫోటో జర్నలిస్టుగా సేవలందించిన రాజేష్, ఎంతో బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడని ఆయన కొనియాడారు. మీడియాకు ఫొటో జర్నలిస్టులు కళ్ళు, చెవుల లాంటి వారన్నారు. పత్రికల్లో వార్తలకు సాక్ష్యంగా నిలిచేది ఫొటోలేనని, ఆ ఫొటోల కోసం ఫొటో జర్నలిస్టులు పడే తిప్పలు వర్ణనాతీతమని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పాత్రికేయ వృత్తి అభద్రతా, అత్యంత ప్రమాదకరమైనట్లు ప్రజాస్వామిక దేశాలకు ఐక్యరాజ్య సమితి ఎప్పుడో సూచించిందని ఆయన గుర్తుచేశారు. ఫొటో, వీడియో జర్నలిస్టుల ఆరోగ్య భద్రత పై మీడియా సంస్థల యాజమాన్యాలు దృష్టి సారించాలని ఆయన సూచించారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరాహత్ అలీ మాట్లాడుతూ.. ప్రాణాలను ఫణంగా పెట్టి మీడియా రంగంలో వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్న ఫోటో, వీడియో జర్నలిస్టుల జీవితాలు అంధకారంలో మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో లాఠీలను, తూటాలను, కేసులను లెక్కజేయకుండా ఫోటో జర్నలిస్టులు పోషించిన సాహసవంతమైన పాత్ర అభినందనీయమన్నారు. ఫోటో, వీడియో జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం తమ సంఘం నాటి నుండి నేటివరకు అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఎప్పుడూ చిరునవ్వులతో పలకరించే రాజేష్ ఆకస్మిక మృతి తమను ఎంతో కలచివేసిందని, అతని కుటుంబానికి చేయూతనిస్తామని విరాహత్ అన్నారు.
హెచ్యూజే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. రాజేష్ మృతితో తమ సంఘం క్రియాశీలక సభ్యుడిని కోల్పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి హరి, జేఎన్జేహెచ్ఎస్ అధ్యక్షులు బి.కిరణ్ కుమార్, రాజేష్ భార్య లావణ్యతో పాటు ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.