హైదరాబాద్ : రాష్ట్ర మీడియా అకాడమీ భవనాన్ని డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డిని ఆదేశించారు. మంత్రిని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బుధవారం కలిసి, అకాడమీ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వినపత్రాన్ని అందజేశారు. ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన మీడియా సెమినార్లో మంత్రి కేటీఆర్ అకాడమీ భవనాన్ని త్వరగా పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్, అమర వీరుల స్తూపం ప్రారంభోత్సవం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలు వచ్చే జనవరి రెండోవారంలో ముఖ్యమంత్రి ప్రారభిస్తారని, వాటితోపాటు నాంపల్లి, చాపెల్ రోడ్డులో ఉన్న మీడియా అకాడమీ భవనాన్ని సైతం సీఎం చేతులమీదుగా ప్రారంభించేలా చూడాలని అల్లం నారాయణ మంత్రిని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి.. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.