హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో డీసీపీ గోనె సందీప్ సమావేశమయ్యారు. ఈటలకు భద్రత కల్పించే విషయమై డీజీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా పూడూరులో భేటీ అయ్యారు. బుధవారం ఈటల అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య జమునతో చర్చించిన డీసీపీ సందీప్.. గురువారం ఈటలతో మాట్లాడారు. ఉదయం పది గంటలకు అక్కడికి చేరుకున్న డీసీపీ సుమారు అరగంటపాటు ఈటల చెప్పిన విషయాలను రికార్డు చేసుకున్నారు.
ఈ విషయాలను ఉన్నతాధికారులకు వివరించినట్టు డీసీపీ సందీప్ ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. అనంతరం ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఒకటి రెండు రోజుల్లో ఈటల భద్రతపై పోలీస్శాఖ నిర్ణయం తీసుకొనున్నట్టు తెలిసింది. ఈ విషయమై స్పందించిన కేంద్ర హోంశాఖ ఈటలకు ‘వై క్యాటగిరీ’ భద్రత కల్పించనున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా, ఈటలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే భద్రత కల్పించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు.