ములుగు: మేడారంలో సమ్మక్క, సారాలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ఇవాళ ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి (బుధవారం) రోజున మండ మెలగడం, గుడి శుద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 21న బుధవారం సాయంత్రం కూడా గుడి మెలగడం ఉంటుంది. అదేరోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సారాలమ్మ దేవత, గోవిందరాజు దేవుడు, పగిడిద్ద రాజు దేవుడు, వారివారి గద్దెల మీదకు చేరుకుంటారు.
ఫిబ్రవరి 22న మాఘ శుద్ధ త్రయోదశి (గురువారం) నాడు ఉదయం 8 గంటలకు వనదేవరలు గద్దె మీదకు వస్తారు. శ్రీ సమ్మక్క దేవత అదేరోజు సాయంత్రం 6 గంటలకు గద్దె మీదకు చేరుకుంటుంది. ఫిబ్రవరి 23న మాఘ శుద్ధ చతుర్దశి (శుక్రవారం) నాడు శ్రీ సమ్మక్క సారాలమ్మ దేవతలకు, శ్రీ గోవిందరాజులు, శ్రీ పగిడిద్ద రాజులు దేవుళ్లకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు.
ఫిబ్రవరి 24న మాఘ శుద్ధ పౌర్ణమి (శనివారం) నాడు శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలు, శ్రీ గోవిందరాజులు, శ్రీ పగిడిద్ద రాజులు దేవుళ్లు వనప్రవేశం చేస్తారు. ఇక ఫిబ్రవరి 28న మాఘ శుద్ధ బహుళ పంచమి (బుధవారం) రోజున తిరుగువారం పండుగ నిర్వహిస్తారు. దాంతో సమ్మక్క సారలమ్మ జాతర ముగిస్తుంది.