నాలుగు రోజుల పాటు నిర్వహణ
తేదీలను ప్రకటించిన పూజారులు
తాడ్వాయి, ఏప్రిల్ 25: ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసీ పండుగ మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్టు మేడారం పూజారులు ఆదివారం ప్రకటించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు వనదేవతల గద్దెల ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఆదివాసీల కాలమానం ప్రకారం 2022 ఫిబ్రవరిలో వచ్చే మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని మహాజాతర జరిపేందుకు నిశ్చయించారు. ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుట, 17న చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి చేరుట, 18న గద్దెపైకి చేరిన తల్లులకు మొక్కుల సమర్పణ, 19న దేవతల వనప్రవేశం ఉంటుందని పూజారులు వెల్లడించారు. జాతరకు రెండు నెలల ముందు నుంచే భక్తుల రాక మొదలవుతుందన్నారు. నెల రోజుల ముందే అభివృద్ధి పనులను పూర్తిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
మే 1 నుంచి దర్శనం నిలిపివేత
కరోనా కారణంగా వచ్చే నెల ఒకటి నుంచి 15 వరకు వన దేవతల దర్శనాలను నిలిపివేస్తున్నట్టు పూజారులు తెలిపారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, హైదరాబాద్ నుంచి అమ్మవార్ల దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని, ఆయా ప్రాంతాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు సహకరించాలని వారు కోరారు.