తాడ్వాయి, జనవరి 23 : వనదేవతలు కొలువైన మేడారం ముందస్తు మొక్కులతో జనసంద్రంగా మారింది. ఆదివారం సుమారు 3లక్షల మంది భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలిరావడంతో జాతర పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. తలనీలాలు సమర్పించి, జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి నెత్తిన ఎత్తుబెల్లం పెట్టుకొనిఅమ్మవార్ల దర్శనాలకు బయలుదేరారు. సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలకు పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకొన్నారు. కోరికలు తీర్చు తల్లీ అంటూ వేడుకొంటూ యాటపోతులను, కోళ్లను సమర్పించి జాతర పరిసరాల్లో విందుభోజనాలతో ఆనందంగా గడిపారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భక్తుల రాక పెరిగింది. తోపులాట జరుగకుండా గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్కు తాళాలు వేసి బయటి నుంచే దర్శనం చేసుకొనేలా ఏర్పాట్లు చేశారు.
మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా శివయ్య
ములుగు, జనవరి 23 : మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కామారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొర్నిబెల్లి శివయ్యను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్తోపాటు మరో 14 మందిని డైరెక్టర్లుగా నియమించారు. వీరు సోమవారం మేడారంలో బాధ్యతలు చేపట్టనున్నారు.