హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరకు వెళ్లేందుకు 30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు పంపిస్తామని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ సేవలు అవసరమైన భక్తులు సమీపంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ను కలువాలని లేదా 040-30102829 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని సూచించారు. శుక్రవారం బస్భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది మేడారం జాతరకు ఆర్టీసీ రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి 3,845 ప్రత్యేక బస్సులు నడుపుతున్నదని ఎండీ తెలిపారు. మహారాష్ట్రలోని సిరొంచ నుంచి కూడా 45 బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. ప్రైవేటు వాహనాలు సమ్మక్క సారలమ్మ గద్దెలకు 7 నుంచి 8 కి.మీ. దూరంలో ఆగిపోతాయని, ఆర్టీసీ బస్సులు మాత్రం గద్దెలకు అతి సమీపానికి వెళ్తాయని చెప్పారు. గత జాతర సమయంలో ఉన్న చార్జీలే ఇప్పుడూ ఉంటాయని ఎండీ తెలిపారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ‘ఆర్టీసీ విత్ టీఎస్ఆర్టీసీ’ పేరుతో వరంగల్కు చెందిన కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్) విద్యార్థులు రూపొందించిన యాప్ను ఆవిష్కరించారు. సమావేశంలో ఈడీలు పురుషోత్తం, యాదగిరి, సోమశేఖర్, వినోద్కుమార్ పాల్గొన్నారు.
యాప్తో ఇవీ ఉపయోగాలు..
యాప్ను tsrtc.telangana.gov.in లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలి. మేడారం జాతర చరిత్ర, జారత ప్రాంత మ్యాప్ యాప్లో ఉంటుంది. మేడారం జాతరకు రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి వెళ్తున్న బస్సుల వేళలు, చార్జీల వివరాలు, స్పెషల్ బస్సుల బుకింగ్, ఆయా డిపోల మేనేజర్ల నంబర్లు ఉంటాయి. ఆన్లైన్ టికెట్ బుకింగ్కు సంబంధించి లింక్లు ఉంటాయి. నావిగేషన్ ద్వారా జాతర పరిసరాల్లో మీరు ఉన్న ప్రాంతం నుంచి గద్దెల వరకు వెళ్లే మార్గాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు.