మెదక్ : జిల్లాలో కలకలం రేపిన రియల్టర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట శివారులో ప్రధాన రహదారి పక్కన కారుతో పాటు డిక్కీలో పూర్తిగా కాలిపోయి ఉన్న శవం మంగళవారం దొరికిన విషయం తెలిసిందే. మృతుడిని మెదక్ పట్టణానికి చెందిన ధర్మాకర్ శ్రీనివాస్(45)గా గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హత్య కేసు వివరాలు ఎస్పీ చందనదీప్తి వెల్లడించారు. శ్రీనివాస్ను నిఖిల్, శివ, పవన్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేసినట్లు నిర్ధారణ అయిందన్నారు. విచారణలో ప్రధాన నిందితుడు శివగా తేలిందన్నారు. ఇతడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. హత్యకు కారణం మాత్రం పూర్తిగా నిర్ధరణ కాలేదన్నారు. వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి ఆధారాలు లభించిన తర్వాతే హత్యకు గల కారణంగా కచ్చితంగా చెప్పొచ్చన్నారు. శ్రీనివాస్ గొంతు కోసి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉందని తెలిపిన ఎస్పీ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కారులో పెట్టి దగ్ధం చేసినట్లు పేర్కొన్నారు.