Harish Rao | మెదక్ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరా గాంధీ మోసం చేస్తే ఆ కలను కేసీఆర్ నెరవేర్చారని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పవన్నీ అబద్ధాలే అని విమర్శించారు. మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హరీశ్రావు మాట్లాడారు. మెదక్ రాందాస్ చౌరస్తా మీదుగా నామినేషన్కు వెళ్లావ్ కదా.. అక్కడ అభివృద్ధి కనిపించలేదా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నువ్వు నామినేషన్కు వెళ్లిన కలెక్టరేట్ కట్టింది కేసీఆర్.. నిన్ను మెదక్కు రప్పించిన ఘనత కేసీఆర్ది అని అన్నారు.
మెదక్కు రైలు తెచ్చింది కేసీఆర్ అని హరీశ్రావు తెలిపారు. వంద కోట్లు ఖర్చు చేసి రైల్వే లైన్ తీసుకొచ్చారని.. మూడు జిల్లాలు చేసి, మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. చిట్టచివరి ఆయకట్టుకు నీళ్లిచ్చారని.. ఇంత చేసినా కేసీఆర్ ఏమీ చేయలేదంటున్నావని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ వందకోట్లు ఇస్తే వాపసు తీసుకున్నాడని.. రేవంత్ రెడ్డికి అమ్మవారి ఉసురు తగులుతుందని మండిపడ్డారు.
అబద్ధాలు ఆడడంలో రేవంత్కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని హరీశ్రావు అన్నారు. ఉరికిచ్చి కొడ్తా, పేగులు మెడలే వేసుకుంటా, బొందపెడ్తా, మానవ బాంబునవుతా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. ఒక సీఎం ఇలాగేనా మాట్లాడాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల గురించి అడిగితే హెచ్చరిస్తున్నారని.. కేసులు పెడుతున్నారని విమర్శించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని వందరోజులు దాటినా చేయనందుకు చెంపలేసుకుని 60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాట తప్పడం, అబద్ధాలు ఆడటం రేవంత్ నైజం అని విమర్శించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని లోకల్ కాదని రేవంత్ చేసి వ్యాఖ్యలను హరీశ్రావు ఖండించారు. ఆయన ఇక్కడే స్థిరపడిన ఓటర్ అని స్పష్టం చేశారు. కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరికి పోయింది నువ్వు అని విమర్శించారు. నా ఎత్తుతో రేవంత్రెడ్డికి ఏం పని అని ప్రశ్నించారు. రైతుల గురించి ఆలోంచి, సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అహంకారంతో గాల్లో తేలుతున్న కాంగ్రెస్ భూమ్మీదకు రావాలంటే వెంకట్రామిరెడ్డిని పార్లమెంటుకు పంపించాలని పిలుపునిచ్చారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు 18 రోజులుగా వేచిచూస్తున్నా ప్రభుత్వం కొనడం లేదని హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొన్నామని గుర్తు చేశారు. కష్టాల పాలైన రైతులను పరామర్శించడానికి నీకు ఒక్క నిమిషం టైమ్ దొరకడం లేదా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మీ పార్టీ నేతలు వీహెచ్, మోత్కుపల్లినే నువ్వు కలవడం లేదు. ఇదేనా ప్రజా పాలన? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునే బదులు ప్రజల కష్టాలు తీర్చాలని హితవు పలికారు. కేసీఆర్ను తిడుతూ కాలక్షేపం చేయడం కాదు హామీలను నెరవేర్చాలన్నారు. హామీలు కోసం బాండు రాసిచ్చి బాండ్ల విలువ కూడా తీశావని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్లో గెలిచేది బీఆర్ఎస్సే అని ఆయన స్పష్టం చేశారు. జిల్లా ఇచ్చింది మేం, గోదావరి నీళ్లు తెచ్చింది మేం, లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మేం. విజ్ఞులైన మెదక్ ఓటర్లు మమ్మల్నే ఆదరిస్తారని పేర్కొన్నారు.