వనపర్తి, జూన్ 17 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో ఉత్పాదకత పెరిగినప్పుడే అంతర్జాతీయంగా పోటీని తట్టుకొని నిలబడతామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి గిరిజన ఫ్రూట్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ కస్టమ్స్ హైరింగ్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. సాగులో యాంత్రీకరణ పెరగాలని సూచించారు. అప్పుడే ప్రపంచ ప్రమాణాలను అందుకోవడం వీలవుతుందని చెప్పారు.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని తెలిపారు. సాగునీటి రంగంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. నాటి బీడు భూములు నేడు పచ్చని పైర్లతో సస్యశ్యామలంగా మారాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తెలంగాణ ఇంకా బాగుంటుందని చెప్పారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.