హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవకతవకలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం శాసనమండలిలో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలపై చర్చ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకం మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని సూచించారు. అద్దె ఇండ్లలో ఉంటూ.. టాటా ఏస్ వాహనం కిరాయికి నడుపుకొంటున్న వ్యక్తికి 4 వీలర్ వాహనం ఉందని అనర్హుడిగా ప్రకటించారని తెలిపారు. బేస్మెంట్లు కట్టుకున్నవారిని లబ్ధిదారులుగా అనుమతించాలన్నారు. రెండో విడత మంజూరు చేసే ఇండ్ల నిర్మాణాల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకొని నిబంధనల్లో మార్పులు చేయాలని చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూచించారు.
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు..
రాష్ట్ర ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పరాభవనామ సంవత్సరంలో ప్రజలకు శుభం కలుగాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు చాటిచెప్పేలా అందరూ ఉగాదిని సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసిరావాలని, సమృద్ధిగా వానలు కురిసి పాడిపంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని సుఖేందర్రెడ్డి ఆకాంక్షించారు.