హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బిడ్డకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ఇస్టా) అధ్యక్షుడిగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కే కేశవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న ఇస్టా కాంగ్రెస్ సదస్సులో బుధవారం ఇస్టా నూతన కమిటీని ఎన్నుకొన్నారు. 2025 వరకు కేశవులు ఇస్టా అధ్యక్షుడిగా కొనసాగుతారు. భారతదేశం, ఆసియా నుంచి ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తి కేశవులే కావడం విశేషం. ఉపాధ్యక్షుడిగా అమెరికాకు చెందిన ఎర్నెస్ట్ ఎలాన్ ఎన్నికయ్యారు. ఈ నూతన కమిటీలో ఇండియాతోపాటు అమెరికా, కెనడా, న్యూజీలాండ్, ఫ్రాన్స్, ఫిలిఫైన్స్, అర్జెంటీనా, జర్మనీ, జింబాంబ్వే, ఇటలీ, ఉరుగ్వే దేశాలకు చెందిన 11 మంది సభ్యులున్నారు.
మంత్రి కేటీఆర్ అభినందన
ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన కేశవులుకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. గురువారం ఆయన కేశవులు ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ఆసియా నుంచి ఎన్నికైన తొలి వ్యక్తి తెలంగాణ అధికారి కావడం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అని మరోసారి నిరూపితమైందని అన్నారు.