హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): షెడ్యూల్డ్ కులాల జాబితాలో మొత్తంగా 59 కులాలు ఉన్నాయి. అందులో మాల, మాదిగతోపాటు మరో 57 కులాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సీలకు వేర్వేరుగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆయా కులాల అభివృద్ధికి ఏటా రూ.750 కోట్లు కేటాయిస్తామని చేవెళ్ల డిక్లరేషన్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన అనంతరం అందుకు విరుద్ధంగా కేవలం మాల, మాదిగ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రెండేండ్ల క్రితం ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నది. అడుగు కూడా ముందుకు పడలేదు. మరోవైపు ఎస్సీ జాబితాలోని 57 కులాలను మాల, మాదిగ కులాలకు ఉపకులాలుగా పరిగణిస్తూ వాటిని ఆయా కులాలతో కలుపుతూ వర్గీకరించింది. ఇటీవలనే ఎస్సీ రిజర్వేషన్లన్లు మూడు గ్రూపులుగా విభజించింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ను ఏవిధంగా విభజించాలో తెలియని దుస్థితి నెలకొన్నది. మాల, మాదిగ మినహా ఎస్సీలోని మిగిలిన కులాలు మాత్రం తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అమలు చేసే కార్యక్రమాల్లో కేవలం కొన్ని ఎస్సీ కులాలకే దక్కుతున్నాయనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎస్సీ కార్పొరేషన్ను విభజించి మూడు అంటే మాల, మాదిగ, ఎంబీఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ఏటా బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్లో ప్రకటించింది. కానీ రెండేండ్ల క్రితం మాదిగ, మాల కార్పొరేషన్లనే ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీఎస్సీ కార్పొరేషన్ ఊసే మరచిపోయింది. దీంతో ఎంబీఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. మాల, మాదిగ కార్పొరేషన్ ఏర్పాటుపై కూడా ప్రతిష్టంభణ నెలకొన్నది. మాదిగ కార్పొరేషన్ కింద ఏయే షెడ్యుల్డ్ కులాలను, మాల కార్పొరేషన్ కింద ఏయే షెడ్యూల్డ్ కులాలను చేర్చాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రెండు కార్పొరేషన్ల ఏర్పాటు కూడా అసాధ్యమనే అభిప్రాయాలు అధికారవర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఎస్సీలకు ప్రస్తుతం రాజ్యాంగం కల్పిస్తున్న 15% రిజర్వేషన్ ఆ ఫలాలు తమకు అందడం లేదని ఎంబీఎస్సీ (మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలు) ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. మాల, మాదిగ కులాల గ్రూపుల్లో ఉన్న వెనుకబడ్డ దళిత కులాలు తీవ్రంగా నష్టపోయాయని ఉషామెహ్రా కమిషన్ సైతం గతంలో నివేదించింది. ఈ నేపథ్యంలోనే తమను ఉపకులాలుగా పరిగణించవద్దని, మాల, మాదిగ గ్రూపుల నుంచి వేరు చేయాలని 57 ఎస్సీ కులాలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం ఎంబీఎస్సీ కులాలను వేరుగానే గుర్తిస్తామని, ప్రత్యేక కార్పొషన్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన అనంతరం హామీని అటకెక్కించింది. ఈ నేపథ్యంలో తమకూ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎంబీఎస్సీ కులాలు డిమాండ్ చేస్తున్నాయి.
మాల, మాదిగ కార్పొరేషన్లతో 57 కులాలను కలిపితే ఊరుకునేది లేదు. వాటికోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలి. గత ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్ వల్ల మాల, మాదిగకులాలే పూర్తిగా లబ్ధిపొందాయి. ఇతర వెనకబడ్డ 57 ఎస్సీ కులాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అనేక పోరాటాలు చేశాం. ఆ మేరకు హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టింది. కానీ, అవే మాల, మాదిగల కిందే మిగతా 57 కులాలను పెట్టడం దారుణం. ఎస్సీ జాబితాలోని మిగతా కులాలు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక సంప్రదాయాలు కలిగి ఉన్నాయి. ఏ ఒక కులం మరో కులానికి ఉపకులం కాదు. కొంతమంది కుట్రల వల్ల వెనుకబడ్డ దళిత కులాలపై ఉపకులాలనే ముద్ర పడింది. ఇటీవల రిజర్వేషన్ వర్గీకరణలోనూ తీవ్ర అన్యాయం చేశారు. 57 ఎస్సీ కులాలకు మరో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
– బైరి వెంకటేశం, 57 ఎస్సీ కులాల హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు