హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కల్తీ మద్యం చావులకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని.. ఆ చావుల్లో నాటి మంత్రి, నేటి బీజేపీ నాయకురాలు డీకే అరుణది ప్రధాన పాత్ర అని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ విమర్శించారు. ఆ విషయాన్ని మరిచిన ఆమె నేడు ఇతరులపై ఆరోపణలు గుప్పించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ గురించి ఎంపీగా ఉన్నప్పుడే కల్వకుంట్ల కవిత పార్లమెంట్లో ప్రశ్నించారని, ఢిల్లీలో ధర్నా చేస్తే కనీసం బీజేపీ పట్టించుకోలేదని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఒక మహిళగా డీకే అరుణ పోరాడాల్సిం ది పోయి.. ఆ బిల్లు గురించి గొంతెత్తుతున్న కవితను విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితపై తప్పుడు ఆరోపణలు చేస్తే తాము చూస్తూ సహించబోమని, ఎవరెన్ని కుట్రలు, ఆరోపణలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.