హైదరాబాద్ : అవినీతికి, స్కాములకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ నిలుస్తుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్( Rajeev Sagar |) దుయ్యబట్టారు. హైదరాబాద్కు తరలిస్తుండగా బెంగళూరులోని కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో పట్టుబడ్డ రూ. 42 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. కర్ణాటకలో గెలిచి ఆరు మాసాలు గడవక ముందే వసూళ్ల పర్వానికి తెరలేపారని విమర్శించారు. అక్కడ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో తెలంగాణలో గెలువాలని చూస్తుందని మండిపడ్డారు.
తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని అందుకే వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తుందన్నారు. అందులో భాగంగానే అక్కడి బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి అక్కడి నుంచి వేల కోట్లు వసూలు చేసిన డబ్బులను తెలంగాణకు తరలిస్తున్నారని విమర్శించారు. నేడు తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి అక్రమంగా డబ్బు తరలించి దొరికిన కాంగ్రెస్ పార్టీ.. రేపు తెలంగాణలో అధీకారంలోకి వస్తే ఇదే తరహాలో ఇతర రాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ నుంచి అక్రమంగా డబ్బు తరచించడం ఖాయమన్నారు.
కర్ణాటక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి.. ఇతర రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని, అందుకే ఇంతవరకు ఒక్క అభ్యర్థిని సైతం ప్రకటించలేదని విమర్శించారు. ఆలు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు అసలు అభ్యర్థులనే ప్రకటించని కాంగ్రెస్ పార్టీలో డజనుకు పైగా నేతలు సీఎం పదవి కోసం పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు.