హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ప్రముఖ అంతర్జాతీయ క్రీడ ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహణ విజయవంతానికి ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు చైర్మన్గా మేనేజింగ్ కమిటీతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. దేశంలోనే తొలిసారిగా ఫార్ములా-ఈ రేసింగ్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నది.
2023 ఫిబ్రవరి 11న నిర్వహించనున్న ఈ పోటీలకు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్(ఎఫ్ఐఏ) హైదరాబాద్ను ఎంపిక చేసింది. మేనేజింగ్ కమిటీలో మంత్రి కేటీఆర్తో పాటు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మహీంద్రా రేసింగ్ సీఈవో, టీం ప్రిన్సిపల్ దిల్బాగ్ గిల్ ఉంటారు. అరవింద్ కుమార్ ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్మన్గా మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ పోటీలను హుస్సేన్సాగర్, సెక్రటేరియట్, లుంబినీ పార్కు మీదుగా 2.7 కిలోమీటర్లలో నిర్వహిస్తారు.