హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): రోగం వచ్చిందా? లేదా? తెలుసుకోవాలంటే దవాఖానకు పరుగులు పెట్టాలి. అక్కడికి వెళ్లాక రోగ నిర్ధారణ పరీక్షలు అంటారు.. వాటికోసం వేలకు వేలు ఖర్చు. ఆ బాధ లేకుండా, ఇంట్లోనే సొంతంగా పరీక్షలు చేసుకొనే స్మార్ట్ కోటును హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అభిషేక్ కుమార్ జెనా, ప్రతీక్, రేహాన్ మొహియెద్దీన్, మహ్మద్ అబ్దుల్లా ఉమర్, రోహిత్రెడ్డి రూపొందించారు. ఈ కోటును ధరిస్తే చాలు.. అందులో ఉండే సెన్సర్లు బీపీ, షుగర్, పల్స్రేట్, జింక్, సోడియం వివరాలను తెలియజేస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పనిచేసే ఈ జర్కిన్లో పల్స్ ఆక్సీమీటర్, గ్లూకోజ్ మీటర్, ఈసీజీ మిషన్ వంటి వాటిని అమర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించి, వాటిని సెన్సర్లతో అనుసంధానం చేశారు.
జర్కిన్ను బ్లూటూత్ ఆధారంగా స్మార్ట్ఫోన్తో అనుసంధించారు. స్మార్ట్ జాకెట్ను ధరించినప్పుడు వాటిలోని సెన్సర్లు శరీరంలో రక్తపోటు, గుండెవేగం వంటి వాటిని గ్రహిస్తాయి. సెన్సర్ల సిగ్నళ్లను బ్లూటూత్ ఆధారంగా స్మార్ట్ఫోన్ గ్రహించి స్క్రీన్ మీద ఫలితాలను చూపిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఈ స్మార్ట్ జర్కిన్ ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే వాకింగ్ చేసేలా అప్రమత్తం చేస్తుందని పేర్కొన్నారు.