హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. వడి బియ్యం, చీర సారెలతో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి (Rangam Bhavishyavani) వినిపించారు. ‘నాకు సంతోషంగా ఉంది. నాకు కావాల్సిన పూజలన్నీ అందిస్తున్నారు. బాలికలు, యువతులు, మహిళలు ఇలా ఎవరు బోనం సమర్పించినా స్వీకరిస్తా. పంటలు బాగా పండుతాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కోరినన్ని వర్షాలు కురుస్తున్నాయి. నన్ను చూడాలంటే 48 గంటలు కష్టం అంటున్నారు. ఆమాత్రం కష్టపడలేరా?. ఏమి తెచ్చినా ఆనందంగా తీసుకుంటా.
ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతా. ప్రజలను చల్లగా కాపాడుకుంటా. ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా. నా రూపాన్ని పెట్టండి. నారూపాన్ని తప్పకుండా పెట్టించుకుంటా, నిలబెట్టుకుంటా. నా గ్రామ ప్రజలందరూ చల్లని సాగ పడుతున్నారు.. అంటూ స్వర్ణలత భవిష్యవాణిలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Rangam
కాగా, రంగం నేపథ్యంలో మహంకాళి అమ్మవారి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. అంతకుముందు అంబారీ ఊరేగింపు అందరినీ ఆకట్టుకున్నది. సాయంత్రం 7 గంటలకు ఫలహారం బండ్ల ఊరేగింపుతో బోనాల జాతర ముగియనుంది.