హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది. బండ్లగూడ, పోచారంలో లాటరీ పద్ధతిలో ఫ్లాట్లలను కేటాయించేందుకు రిజిస్ట్రేషన్లు జోరుగా నమోదవుతున్నాయి. అతి తక్కువ ధరలో సొంతింటి కలను సాకారం చేసుకునే వెసులుబాటు ఉండటంతో మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులు, వ్యాపారులు ఈ ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బండ్లగూడ, పోచారంలో ఏర్పాటు చేసిన మాడల్ హౌసెస్ను రోజు 250 నుంచి 300 మంది సందర్శించి వెళ్తున్నారు. దాదాపు వంద మంది ఆన్స్పాట్ రిజిస్ట్రేషన్లు చేసుకొంటున్నారు. ఈ నెల 12 నుంచి గురువారం రాత్రి వరకు 10,700 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.1.07కోట్ల ఆదాయం సమకూరింది. వచ్చేనెల 14 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. దాంతో రిజిస్ట్రేషన్లు మరింత పెరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. వీటితో పాటు నల్లగొండ, కరీంనగర్, మహబూబ్నగర్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని రాజీవ్ స్వగృహ ప్లాట్లు, భూముల వేలానికి నోటిఫికేషన్ విడుదలైంది. దాంతో ఆయా జిల్లాల్లోనూ ఆశావహుల తాకిడి పెరిగింది.