మెండోరా, జూలై 4: నిజామాబాద్ జిల్లా మెండోరా మం డలం బుస్సాపూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. జాతీయ రహదారికి కేవలం 20 మీటర్ల దూరంలోనే మొదటి అంతస్తులో ఈ బ్యాంకు ఉన్నది. బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు సీసీ కెమెరాలను పగులగొట్టారు. అనంతరం అలారం వైర్లు కట్ చేశారు. సీసీ కెమెరాల డీసీఆర్ను తొలగించారు. అనంతరం గ్యాస్ కట్టర్తో బంగారం లాకర్ను కట్ చేశారు. మంటలంటుకొని లాకర్లోని రూ.7.35 లక్షల నగదు కాలి బూడిదైంది. లాకర్లోని ఎనిమిది కిలోల 30 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.4 కోట్ల వరకు ఉంటుంది. ఘటనా స్థలిని పోలీస్ కమిషనర్ నాగరాజు పరిశీలించారు. బ్యాంకులో చోరీ చేసినవారు స్థానికులు కాదని, ఇతర రాష్ర్టాలకు చెందిన ముఠా పనే అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.