Cyber Crimes | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): తెలియని నంబర్ నుంచి కాల్ చేస్తారు.. పురుషులైతే అమ్మాయిలు, స్త్రీలు అయితే అబ్బాయిలు మాట్లాడుతారు.. ఎవరండీ! అని అడగ్గానే.. అయ్యయ్యో! తెలిసిన వారికి కాల్ చేయబోయి మీకు రాంగ్ కాల్ వచ్చిందని బుబ్జి బుజ్జి మాటలు చెప్తారు. సారీ! అని తియ్యగా మాట్లాడుతారు. మనం ఏమీ అడగకముందే తన ఫ్రెండ్కు చెప్పబోయే రూ.లక్షల బిజినెస్ ప్లాన్ చెప్తారు. అదేదో బాగుందని ఆసక్తి చూపామో.. నిండా మోసపోయినట్టే. ముందు ఒక బిజినెస్ ఐడియా చెప్తారు. తాను సులువుగా రూ.కోట్లు సంపాదించానని వివరిస్తారు.
తాను చాలా బిజీ అన్నట్టు కాల్ కట్ చేసి, కొన్ని రోజులకు బిజినెస్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాట్సాప్ చేస్తారు. మళ్లీ కాల్ చేసి ఆప్యాయంగా మాట్లాడుతూ ఐడియా నచ్చితే రంగంలోకి దిగాలని భరోసా ఇస్తారు. సోషల్ మీడియా నకిలీ ప్రొఫైళ్ల లింక్లు పంపి చెక్ చేసుకోవాలని నమ్మిస్తారు. నమ్మితే ఖతం. నిట్టనిలువునా ముంచేస్తారు. దీన్నే ‘పిగ్-బచరింగ్’ అంటారు. దీనర్థం.. వధించేముందు పందిని కొవ్వు పట్టేలా మేపటం. మన భాషలో చెప్పాలంటే.. బలిచ్చే ముందు పొట్టేళ్లను కొవ్వు పట్టేలా మేపటం అన్నమాట. ఇలాంటి మోసాలతో దేశవ్యాప్తంగా నిరుడు రూ.10 వేల కోట్లు సైబర్ నేరగాళ్లు దండుకున్నట్టు అంచనా. నిరుడు నమోదైన అన్ని సైబర్ నేరాల్లో పిగ్ బచరింగ్ వాటా 56 శాతం.
బాధితుల ఎంపిక దగ్గర్నుంచి, వారు ఎక్కడ పని చేస్తున్నారు? వారి ఇష్టాలు, అయిష్టాలపై, సోషల్ మీడియా అకౌంట్స్ అధ్యయనం చేసిన తర్వాతే టార్గెట్ చేయటం ఈ కొత్త స్కామ్లో ప్రధాన అంశం. మనతో మాట్లాడే వ్యక్తి ఎవరో మనకు తెలియకపోయినా.. మన ఇష్టాలు, మన ఆలోచనలకు తగ్గట్లుగా మాట్లాడటం ప్రారంభిస్తే.. వారిపై తెలియని నమ్మకం కుదురుతుందనేది సైబర్ నేరగాళ్ల ప్రాథమిక సూత్రం. రాంగ్కాల్తో మొదలై.. బిజినెస్ ఐడియా, ఇన్వెస్ట్మెంట్, పార్ట్టైమ్ జాబ్, ఫ్రెండ్షిప్, గిఫ్టులు అంటూ సైబర్ మోసగాళ్లు మాటలు చెప్తారు. మోసగాళ్లు అని తెలిసేలోపు సర్వం దోచేస్తారు.
ఇటీవల మోసపోయిన బాధితుల ప్రొఫైల్స్ విశ్లేషిస్తే దేశవ్యాప్తంగా ఈ స్కామ్ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఈ క్రమంలో పిగ్-బచ్చెరింగ్కు పాల్పడుతున్న 18 మంది సైబర్ నేరగాళ్లను గుర్తించి అరెస్టు చేశాం. వారిని విచారించగా ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్లో ఉన్న సైబర్ లింక్లు వెలుగులోకి వచ్చాయి. వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయగా చైనా నుంచి ఈ నెట్వర్క్ నిర్వహిస్తున్నట్టు గుర్తించాం. మన దేశంలో ఆయా రాష్ర్టాలకు చెందిన వారిని సైబర్ నేరగాళ్లు భారీగా రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు తెలిసింది. రాంగ్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. – ఏడీజీ శిఖాగోయల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్