హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ధాన్యానికి భారీ డిమాండ్ ఉండటంతో రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఇతర రాష్ర్టాల వ్యాపారులు సైతం తెలంగాణకు తరలివస్తున్నారు. ధాన్యానికి డిమాండ్ హెచ్చడం, కొనుగోలుకు పోటీ పెరగడంతో మిల్లర్లు, వ్యాపారులు ముందుగానే రైతులతో మాట్లాడుకొంటున్నారు. అందుకోసం కల్లాల్లోకి వెళ్లిమరీ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వడ్లు పచ్చిగున్నా.. తాలు ఎక్కువున్నా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ధాన్యం దొరికితే చాలు అనుకునేలా వ్యాపారుల పరిస్థితి నెలకొంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ధాన్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. దేశంలో బియ్యానికి కొరత ఏర్పడటం, అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మరోవైపు ఈ సీజన్లో దేశంలోనూ వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గుముఖం పట్టింది. సుమారు 50 లక్షల ఎకరాలకు పైగా వరి విస్తీర్ణం తగ్గినట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే నెలకొన్న ధాన్యం కొరతకు తోడు సాగు తగ్గుదల మరింత ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ధాన్యానికి, బియ్యానికి భారీగా డిమాండ్ నెలకొన్నది. ఒక దశలో క్వింటాలు ధాన్యం రూ. 3,500 వరకు చేరింది. ఈ నేపథ్యంలో నూకల ఎగుమతిని నిషేధించిన కేంద్రం నాన్ బాస్మతి బియ్యం ఎగుమతిపై గతంలో ఎప్పుడూ లేని విధంగా 20 శాతం పన్ను విధించడం గమనార్హం.
తెలంగాణలో పట్టనంత పంట..
ఈ సీజన్లో వరి సాగు దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గినా.. తెలంగాణ మాత్రం భారీగా పెరిగింది. రికార్డుస్థాయిలో ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. తద్వారా ఈ సీజన్లో కోటిన్నర టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో సుమారు కోటి టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చునని భావిస్తున్నారు. ఓ వైపు దిగుబడి తగ్గి డిమాండ్ హెచ్చడం, అదే సమయంలో తెలంగాణలో పంట దిగుబడి పెరగనుండటంతో ఇతర రాష్ర్టాల వ్యాపారులు తెలంగాణ బాట పట్టారు.
30లక్షల టన్నుల వడ్లు కొన్న వ్యాపారులు
ఒకప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు బియ్యం దిగుమతి అయ్యేవి. ఇక్కడి వ్యాపారులు అక్కడికి వెళ్లి మరీ ధాన్యం, బియ్యం కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఇతర రాష్ర్టాల మిల్లర్లు, వ్యాపారులు తెలంగాణ రైతు కల్లాల్లోకి వస్తున్నారు. పొలంలోనే కాంటా పెట్టి వడ్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు 30 లక్షల టన్నుల వరకు వడ్లను ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇందులో పది లక్షల టన్నుల ధాన్యం కొన్నది ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వ్యాపారులే. ఇక్కడి మిల్లర్లు, వ్యాపారులు కొన్నది 15 నుంచి 20 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఓ వైపు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీ పడి ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకూ భారీగా ధాన్యం తరలివస్తున్నది. ఇప్పటివరకు 12 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది.
మద్దతు ధరకు మించి చెల్లింపు
తమ మధ్య పోటీ నేపథ్యంలో వ్యాపారులు మద్దతు ధరకు మించి రైతులకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్-ఏ రకానికి రూ.2,060 ఉండగా.. సాధారణ రకానికి రూ.2,040గా ఉంది. అయితే వ్యాపారులు సన్నరకపు ధాన్యానికి రూ.2,100 నుంచి 2,300 వరకు చెల్లిస్తున్నట్టు తెలిసింది. 30 శాతం తేమ, తాలు ఉన్న ధాన్యానికి ఈ ధర చెల్లిస్తుండడం గమనార్హం. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో తేమ 17 శాతం మించి ఉండొద్దు. ఈ లెక్కన రైతులకు క్వింటాలుకు సరాసరిన రూ.2,500 నుంచి 2,700 వరకు ధర దక్కుతున్నది. అంటే క్వింటాలుకు మద్దతు ధర కన్నా రూ.500 వరకు అధికంగా వస్తున్నది. మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా వ్యాపారులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.