హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో గులాబీ గూటికి వలసలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు వరుసగా టీఆర్ఎస్లోకి క్యూకడుతున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం ఎంపీటీసీ సప్పిడి రాధికా శ్రీనివాస్రెడ్డి, దేవత్పల్లి ఎంపీటీసీ సుజాత శంకర్ బుధవారం హైదరాబాద్లో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి-భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
400 మంది కాంగ్రెస్ నాయకుల చేరిక
నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో రావిగూడెం, వెల్మకన్నె, మునుగోడుకు చెందిన సుమారు 400 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే కంచర్ల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరుగనున్న మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వారు సూచించారు.