నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకుడు ముద్ధం బాలరాజుతో 500 మంది నాయకులు, కార్యకర్తలు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మునుగోడు, ఖమ్మం, నల్గొండ నుంచి ఎన్ని వేల కోట్లు వచ్చినా నియోజకవర్గ ప్రజల మనసు చిరుమర్తి వైపే ఉంటుందన్నారు.
రూ.135 కోట్లతో నకరేకల్ పట్టణాన్ని అభివృద్ధి చేశానని.. వీరేశం తన ఐదేళ్ల కాలంలో ఐదు కోట్లు కూడా పట్టణానికి తీసుకురాలేకపోయాడని విమర్శించారు. అలాంటి వీరేశానికి ఎందుకు ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ని గెలిపిస్తాయని, నకిరేకల్ ప్రజలు ఆశీర్వదించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, సుంకరి మల్లేష్ గౌడ్, తదతరులు ఉన్నారు.