బంజారాహిల్స్, జూన్ 3: ఇంటర్ విద్యార్థినిపై కారులో సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకొన్నది. జూబ్లీహిల్స్లోని అమ్నీషియా పబ్లో విందుకు వచ్చిన ఆమెను ఇంటి వద్ద దింపుతామని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి కారులోనే అమానుషంగా ప్రవర్తించారు. వివరాల్లోకెళ్తే.. బంజారాహిల్స్ రోడ్డు నం.14లో నివాసం ఉంటున్న హాదీ అనే యువకుడు గత నెల 28న స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నం.36లోని అమ్నీషియా పబ్లో విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో సుమారు 150 మంది యువకులు పాల్గొన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నం.14లో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని (17) కూడా పార్టీకి హాజరైంది. ఆ విద్యార్థిని, బంజారాహిల్స్కు చెందిన ఓ యువకుడితో పాటు మరికొంతమంది సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు.
ఇంటి వద్ద దింపుతామని నమ్మించి బెంజ్ కారులో ఎక్కించుకొన్నారు. కొంతమంది ఇన్నోవా కారులో ఎక్కారు. వారంతా రెండు కార్లలో బంజారాహిల్స్ రోడ్డు నం.14లోని కాన్సీయూ బేకరి వద్దకు వచ్చి కాసేపు గడిపారు. 6:40 గంటల ప్రాంతంలో ఐదుగురు యువకులు ఆమెను కారులో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే లైంగికదాడికి పాల్పడ్డారు. 7:30 గంటలకు ఆమెను పబ్ వద్ద దింపేసి వెళ్లిపోయారు. బాధితురాలు ఇంట్లోవాళ్లెవరికీ ఆ విషయాన్ని చెప్పలేదు. తీవ్ర ఆందోళనలో కనిపించటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.
ఆమె గొంతు, మెడ మీద గాయాలు చూసి నిలదీయగా అసలు విషయాన్ని చెప్పింది. గత నెల 31న బాలిక తండ్రి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ 354, 323, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని భరోసా సెంటర్కు తీసుకెళ్లి వాంగ్మూలం సేకరించి, ఐపీసీ 376(డీ)(లైంగికదాడి), పోక్సో కింద కేసును మార్చారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. కొంతమంది యువకులు సాయంత్రం 5:45 గంటలకు బాలికను ఓ బెంజ్ కారులో ఎక్కించుకొన్నట్టు కనిపించింది. బేకరీ వద్ద, తిరిగి పబ్కు వచ్చిన దృశ్యాలను పరిశీలించారు.
బాలికను పబ్ దగ్గర ఎక్కించుకొన్న బెంజ్ కారును బేకరీ వద్దే వదిలేసి వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఇన్నోవా కారుతో పాటు ఘటనలో పాల్గొన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. నిందితుల్లో ఒక యువకుడు వక్ఫ్బోర్డు చైర్మన్ కొడుకు అని తెలుస్తున్నది. ఈ ఐదుగురే కాకుండా మరో యువకుడు పబ్ నుంచి బేకరీకి వెళ్లే సమయంలో కారులో ఉన్నాడని, బంజారాహిల్స్ నుంచి బయలుదేరినప్పుడు అతడు కారులోంచి దిగాడని సమాచారం. అతడు ఎవరనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లైంగిక దాడి ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.‘హైదరాబాద్లో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందన్న వార్త ఆగ్రహం, దిగ్భ్రాంతి కలిగించింది. ఇందుకు బాధ్యులైనవారెవర్నీ వదిలిపెట్టొదు. ఎవరైనా సరే వారి హోదా, అనుబంధాలతో సంబంధం లేకుండా తక్షణమే కఠిన చర్యలు తీసుకోండి’ అని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్పై స్పందించిన హోం మంత్రి.. నేరస్థులందరిపై కఠిన చర్యలు తీసుకొంటామని చెప్పారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని డీజీపీ, హైదరాబాద్ సీపీని ఇప్పటికే ఆదేశించామని రిైప్లె ఇచ్చారు.
27, 28 తేదీల్లో తాను ముంబైలో ఉన్నానని హోం మంత్రి మనుమడు పుర్కాన్ అహ్మద్ తెలిపాడు. బీజేపీ కావాలనే గేమ్ ఆడుతున్నదని, కావాలనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నదని పేర్కొన్నాడు.