సంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ): వాహనాల్లో భద్రత కోసం రూపొందించిన (వెహికల్ టు ఎవ్రిథింగ్) వీ2ఎక్స్ టెక్నాలజీ పరీక్ష విజయవంతమైంది. ఐఐటీ హైదరాబాద్, మారుతి సుజుకీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ.. ప్రమాదాలను నివారించి, పూర్తి భద్రతను కల్పిస్తుంది. బుధవారం కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఈ టెక్నాలజీని మారుతి సుజుకీ ఇంజినీర్లు, విద్యార్థులు కలిసి మారుతి సుజుకీకి చెందిన రెండు ప్రొటో టైప్ వాహనాల్లో వీ2ఎక్స్ పరికరాలను అమర్చి విజయవంతంగా పరీక్షించారు. పరీక్షను స్వయంగా వీక్షించిన మారుతి సుజుకీ ఈడీ రాహుల్ భారతి, ట్రాయ్ సలహాదారు మునిశేఖర్, ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టెలికం డిప్యూటీ డైరెక్టర్ కిశోర్బాబు, టెలికం (వైర్లెస్) డైరెక్టర్ ఎంజే క్రిష్టఫర్, సుజుకీ మోటర్ కార్పొరేషన్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజింగ్ ఆఫీసర్ కజునోబు హోరి వీ2ఎక్స్ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.
వాహనాల ప్రమాదాలను అరికట్టేందుకు అమెరికా, యూరప్ దేశాల్లో డెడికేటెడ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ వ్యవస్థను వాడుతున్నారు. ఇది పరిమిత విస్తీర్ణం, పరిమిత పరిస్థితుల్లోనే పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని జపాన్లోని సుజుకీ మోటర్ కార్పొరేషన్, ఐఐటీ హైదరాబాద్ నిర్ణయించాయి. రెండేండ్ల పాటు పరిశోధనలు చేశారు. దానికోసం ఐఐటీ హైదరాబాద్కు చెందిన 20 మంది విద్యార్థులు, ప్రత్యూష, విపుల్ జిందాల్ పనిచేశారు. 5జీని ఉపయోగించి వీ2ఎక్స్ను అభివృద్ధి చేశారు. వీ2ఎక్స్ పరికరాలను అమర్చిన వాహనాలు 5జీ టెక్నాలజీ ఆధారంగా పరస్పరం వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా మాట్లాడుకొంటాయి. దీనిద్వారా ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తొలగుతాయి. ఇంధన ఆదాకు అవకాశాలు ఉంటాయి. త్వరలోనే ఈ టెక్నాలజీని భారత్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
అప్రమత్తతకు ఐదు వ్యవస్థలు
అంబులెన్స్ హెచ్చరిక వ్యవస్థ: వీ2ఎక్స్ పరికరం అమర్చిన కారుకు అంబులెన్స్ చేరువవుతున్న సమయంలో కారులోని కమ్యూనికేషన్ వ్యవస్థ డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. వీ2ఎక్స్లోని అలర్ట్ సిస్టమ్ రియల్ టైమ్ ప్రాతిపదికన వాహనాల మధ్య ఎంత దూరం ఉన్నది? ఎన్ని నిమిషాల్లో గమ్యస్థానం చేరవచ్చు? క్లియర్ ట్రాఫిక్ రూట్లను అంబులెన్స్ డ్రైవర్కు సూచిస్తుంది.
రాంగ్ వే డ్రైవర్ అలర్టింగ్ సిస్టమ్: తప్పుడు మార్గంలో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించి డ్రైవర్కు హెచ్చరికలు ఇస్తుంది.
పాదచారుల హెచ్చరిక వ్యవస్థ: కారుకు అడ్డుగా వచ్చి ఢీకొనే అవకాశం ఉండే పాదచారులను గుర్తించి డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది.
మోటర్ సైకిల్ అలర్ట్ సిస్టమ్: ప్రమాదం జరిగే ప్రదేశాల్లో (బ్లైండ్ స్పాట్) వేగంగా వచ్చి వాహనాలను ఢీకొట్టే బైక్ల గురించి డ్రైవర్కు సమాచారాన్ని ఇస్తుంది. బైక్ల దూరం, దిశలను గుర్తించి డ్రైవర్ను రియల్ టైమ్లో అప్రమత్తం చేస్తుంది.
రోడ్ కండిషన్ అలర్ట్ సిస్టమ్: పాడైన రహదారులను గుర్తించి వాహన డ్రైవర్ను ముందుగానే అప్రమత్తం చేస్తుంది.
వీ2ఎక్స్లో తెలుగుమ్మాయి ప్రత్యూష కీలకపాత్ర వీ2ఎక్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయటంలో తెలుగమ్మాయి ప్రత్యూష కీలక పాత్ర పోషించారు. విశాఖపట్నానికి చెందిన ప్రత్యూష పదో తరగతి వరకు హైదరాబాద్లోని మదీనగూడలోని సెయింట్ ఆన్స్లో చదువుకొన్నారు. వైజాగ్లో ఇంటర్, ఐఐటీ హైదరాబాద్లో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కొద్దికాలం స్టార్టప్ కంపెనీలో పనిచేసి, జపాన్లోని సుజుకీ మోటర్ కార్పొరేషన్లో ఉద్యోగం సాధించి వీ2ఎక్స్ ప్రాజెక్టుకు ఎంపికయ్యారు. ప్రత్యూష ఈ ప్రాజెక్టుకు ఇంచార్జి.
వీ2ఎక్స్తో రోడ్డు భద్రత
భారత్లో రోడ్డు భద్రతకు వీ2ఎక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. దేశంలోని అన్ని వాహనాలు వీ2ఎక్స్ను వినియోగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరికరాలను మరింతగా చిన్నగా రూపొందించాలి.
– ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్
ఆవిష్కరణల్లో ఐఐటీ హైదరాబాద్ కీలక పాత్ర
వీ2ఎక్స్ రూపకల్పనలో ఐఐటీ పూర్వ విద్యార్థులు ప్ర త్యూష, విపుల్ జిందాల్ కీలకపాత్ర పోషించటం ఆనందం గా ఉన్నది. ఈ టెక్నాలజీ అమలు కోసం అవసరమయ్యే 5జీ టెక్నాలజీని సైతం ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసింది. మానవరహిత వాహనాల పనితీరును జూలైలో పరీక్షిస్తాం.
– ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి