శేరిలింగంపల్లి, మే 29: భర్తపై భార్య అనుమానం.. ఓ మహిళపై లైంగిక వేధింపులకు కారణమైంది. అత్యంత దారుణంగా హింసించి, వీడియో చిత్రీకరించి.. సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తానని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన ఓ యువతి (26) సివిల్స్కు ప్రిపేర్ కావడానికి హైదరాబాద్ అశోక్నగర్లోని ఓ కోచింగ్సెంటర్లో కోచింగ్ తీసుకొంటున్నది. ఇదే సెంటర్లో కొండాపూర్కు చెందిన శ్రీకాంత్ కూడా చేరాడు. శ్రీకాంత్ తొమ్మిదేండ్ల క్రితమే గాయత్రి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకొన్నాడు. కోచింగ్సెంటర్లో సహచరులుగా శ్రీకాంత్కు, బాధితురాలికి మధ్య పరిచయం స్నేహంగా మారడంతో చనువుగా మెలిగారు.
ఈ క్రమంలోనే నిరుడు అక్టోబర్ నుంచి బాధితురాలు మొన్నటి ఫిబ్రవరి వరకు శ్రీకాంత్ ఇంట్లోనే ఉన్నది. శ్రీకాంత్ భార్యకు వీరిద్దరి మధ్య చనువుచూసి అనుమానం పెరిగింది. ఏప్రిల్ 22న గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో వీరిద్దరిపై ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 26 సాయంత్రం బాధిత యువతిని శ్రీకాంత్ భార్య గాయత్రి మాట్లాడాలంటూ ఇంటికి పిలిపించుకొన్నది. యువతి తల్లిదండ్రులతో కలిసివచ్చింది. తల్లిదండ్రులను బయటే ఉంచి.. బాధిత యువతిని మాత్రం ఇంటిలోపలికి తీసుకొని వెళ్లి.. గడియపెట్టి.. పైశాచికానికి ఒడిగట్టింది. అప్పటికే గదిలో ఉన్న ఐదుగురు యువకులు సదరు యువతి నోట్లో గుడ్డలు కుక్కి దారుణానికి ఒడిగట్టారు.
ఆమె ప్రైవేటు శరీరభాగాలను తాకుతూ వికృతంగా ప్రవర్తించారు. యువతికి తీవ్రంగా రక్తస్రావం అయినప్పటికీ కనికరించలేదు. ఈ దృశ్యాలను గాయత్రి నిస్సిగ్గుగా వీడియో తీసింది. అనంతరం గాయత్రి చెప్పులతో బాధిత యువతిని తీవ్రంగా కొట్టింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసింది. దాదాపు 45 నిమిషాలపాటు బాధితురాలిని చిత్రహింసలు పెట్టారు.
లోపల ఏం జరుగుతున్నదో తెలియక ఆందోళనతో తల్లిదండ్రులు డయల్ 100 కు ఫోన్చేశారు. కాసేపటికి బయటకు వచ్చిన బాధితురాలిని తీసుకొని వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. బాధిత యువతితో భర్త చాటింగ్ చేయడాన్ని గాయత్రి.. నిలదీసినట్టు పోలీసు విచారణలో తేలింది. వారిద్దరి మధ్య కొంత కాలంగా గొడవ నడుస్తున్నట్టు తెలిసింది. తమ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని శ్రీకాంత్ గట్టిగా చెప్పడంతో గాయత్రి సదరు యువతిపై కక్ష పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన పృథీ విష్ణు వర్ధన్(22), ఉల్సల మనోజ్ కుమార్(22), సయ్యద్ మస్తాన్(25), షేక్ ముజాహిద్ (25), షేక్ మౌలాలి(32)ని గాయత్రితోపాటు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తోటి యువతి పట్ల పాశవికంగా దాడికి పాల్పడ్డ తన కూతురు గాయత్రి చేసింది ముమ్మాటికీ తప్పేనని.. శిక్షించాల్సిందేనని ఆమె తల్లి కృష్ణవేణి పేర్కొన్నారు. తన కూతురుతోపాటు ఆమె భర్త శ్రీకాంత్ను కూడా ఆరెస్టు చేయాలన్నారు. అతడి ప్రోద్బలం లేనిది తన కూతురు ఇలా చేయదని, అతడి ప్రోద్బలంతోనే ఇలాచేసి ఉంటుందని ఆరోపించారు.