Marri Pravalika | వరంగల్ : తన బిడ్డ చావుకు కారణమైన వాడికి ఉరిశిక్ష వేయాలని మర్రి ప్రవళిక తల్లి విజయ డిమాండ్ చేసింది. మీ రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగకండి.. మమ్మల్ని టార్చర్ పెట్టకండి అని ఆమె విజ్ఞప్తి చేశారు.
రెండు సంవత్సరాల నుంచి తన బిడ్డను హైదరాబాద్లో చదివించుకుంటున్నానని విజయ తెలిపారు. నా కుమారుడు కూడా అక్కడే చదువుకుంటున్నాడు. ఎండల కాయ కష్టం చేసి పిల్లలను చదివిస్తున్నాం. మా పిల్లలకు ఆ కష్టం రాకూడదు అని అక్కడ పంపి చదివిపిస్తున్నాం. కానీ, వాడు మా పిల్లను వేధించాడు. వాడి టార్చర్ భరించలేక మా అమ్మాయి కనీసం మాతో కూడా చెప్పుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడిని బయటకు రాకుండా చేయాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రాకూడదు. మీకు పార్టీల పరంగా ఏమైనా గొడవలు ఉంటే మీరు చూస్కోండి అంతే కానీ మా కుటుంబాన్ని అందులో లాగకండి. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని మాత్రం బయటకు రానీయకండి.. వాడికి శిక్ష వేయండి అని ప్రవళిక తల్లి విజయ డిమాండ్ చేసింది.
మా అక్క ఆత్మహత్యకు శివరామే కారణం అని ప్రవళిక సోదరుడు కుమార్ స్పష్టం చేశారు. మాకు న్యాయం జరగాలంటే అతన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ ఇతర పార్టీలు కూడా మా ఇంటికి రావొద్దు.. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దని కుమార్ విజ్ఞప్తి చేశారు.
అక్క హాస్టల్కు నేను కొంచెం దూరంలోనే ఉంటాను. ఐదు నిమిషాల్లోనే అక్క హాస్టల్కు చేరుకుంటాను. వారానికి మూడు నాలుగు సార్లు కలిసి మాట్లాడుకుంటాం. ముఖ్యంగా అక్క ప్రవళిక చనిపోవడానికి కారణం శివరామ్ అనే వ్యక్తి. వేరే అమ్మాయి వల్ల పరిచయం అయ్యాడు. అప్పటి నుండి అక్కకి ఇష్టం లేకపోయినా తనతో మాట్లాడడం, కాల్ చెయ్యడం, హాస్టల్కు వచ్చి అందరి ముందు మాట్లాడమని ఇబ్బంది పెట్టడం వల్ల, అక్కకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆఖరికి అమ్మకు, నాన్నకు , నాకు.. ఎవరికి చెప్పిన ఏమంటారో, ఏం సమస్య వస్తుందో ఇంట్లో అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది. ముఖ్యంగా అక్క చనిపోవడానికి కారణం హాస్టల్ దగ్గర చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏడిపించడం, కాల్ చెయ్యడం, ఫ్రెండ్స్ ఫోన్ నుండి ఇలా వేరే వేరే నెంబర్స్ నుండి కాల్ చెయ్యడం వల్ల ఎవరికి చెప్పుకోవాలో తెలియక సూసైడ్ చేసుకుంది. అక్కకి ఇప్పుడు న్యాయం జరగాలంటే శివరామ్ని ఎక్కడ ఉన్న పట్టుకుని తన అక్క చనిపోయిన్నట్టుగా ఉరి గానీ, ఎన్కౌంటర్ గానీ చేసి ప్రభుత్వం మాకు న్యాయం చెయ్యాలి. ప్రభుత్వం, కేసీఆర్ చేశారని చెప్తున్నారు కానీ వారు చేయలేదు. మాకు న్యాయం జరగాలంటే వాడిని శిక్షించాలని కుమార్ డిమాండ్ చేశారు.