హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్రెడ్డి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన ఆరోపణను తాను కూడా నమ్ముతున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి చెప్పారు. గాంధీభవన్కు సమాంతరంగా మరో ఆఫీసు నడుస్తున్నదని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్, రాజగోపాల్రెడ్డి చెప్పిన విషయాలన్నీ నిజాలేనని అన్నారు.
రేవంత్రెడ్డి వ్యవహార శైలి నచ్చకనే తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఐఏసీసీ ఇన్చార్జి ముగ్గురు కలిసి పార్టీ అధిష్ఠానానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని శశిధర్రెడ్డి ఆరోపించారు. పార్టీలో సీనియర్ నాయకులంతా వారి దృష్టిలో హోం గార్డుల్లాగా కనిపిస్తున్నామా? అని వాపోయారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై చండూరు సభలో చేసిన వ్యాఖ్యలు సరికావని ఖండించారు.