హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కుమ్మరులు, వడ్డెరలు కడు దీనస్థితిలో జీవనం సాగిస్తున్నారని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. వడ్డెర, కుమ్మరి కులస్తుల జీవనవిధానంపై సెస్ చేయించిన సర్వే సమగ్ర నివేదికను ఆయన శనివారం సీఎం కే చంద్రశేఖర్రావుకు అందించారు. ఈ రెండు కులాల ప్రజల్లో అత్యధిక శాతం మంది మట్టినే నమ్ముకొని జీవిస్తున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. ఆధునిక పనిముట్లు అందించి, నైపుణ్యాలు పెంచాలని కోరారు. కుమ్మరి కులస్థులపై అధ్యయనం కోసం ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని 10 మండలాల పరిధిలో ఉన్న 10 గ్రామాలను ఎంచుకున్నారు. ఒక్కో గ్రామంలో 15 చొప్పున 150 కుటుంబాలపై అధ్యయనం చేశారు. ఇందులో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. వడ్డెర కులస్థులపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని 10 మండలాల పరిధిలో ఉన్న 10 గ్రామాలను ఎంపిక చేశారు .మొత్తం 150 కుటుంబాలపై అధ్యయనం చేశారు. ఇందులో మట్టి వడ్డెర, బండ వడ్డెర కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల వడ్డెర కుటుంబాలు (జనాభాలో 1.1 శాతం) ఉన్నట్టు అంచనా వేశారు.