హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ): మరోసారి మక్కల టెండర్ వేసేందుకు మార్క్ఫెడ్ చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే వానకాలం మక్కలను వేలం ద్వారా విక్రయించిన మార్క్ఫెడ్.. తాజాగా యాసంగిలో కొనుగోలు చేసిన మక్కలను సైతం విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నది. వానకాలం మక్కలకు ఆశించిన ధర వచ్చిందని, యాసంగి మక్కలను కూడా వేలం వేయడం ద్వారా మరోసారి మంచి ధర వస్తుందనే అంచనాతో అధికారులు ఉన్నట్టు తెలిసింది. ఈ సీజన్లో 42 లక్షల టన్నుల మక్కలు ఉత్పత్తి కాగా, ఇందులో ప్రభుత్వం 15 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. అయితే, గోదాముల్లో స్థలం లేకపోవడంతో సుమారు మూడు లక్షల టన్నుల మక్కలను మార్కెట్ యార్డుల్లోని బహిరంగ షెడ్డుల్లో ఉంచినట్టు తెలిసింది. వానకాలంలో షెడ్డుల్లో ఉన్న మక్కలు తడిస్తే పాడైపోయి నష్టం జరుగుతుందనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తొలుత బయట షెడ్డుల్లో ఉన్న మూడు లక్షల టన్నుల మక్కలను వేలం ద్వారా విక్రయించాలని, గోదాముల్లోని మక్కలను తర్వాత దశలో విక్రయించాలని భావిస్తున్నట్టు తెలిసింది.
గత టెండర్ ధరలపై తీవ్ర చర్చ
ఇటీవల టెండర్ల ద్వారా 3.8 లక్షల టన్నుల మక్కలను మార్క్ఫెడ్ వేలం ద్వారా విక్రయించింది. ఈ వేలంలో టన్నుకు సగటున రూ.19,337 ధర పలికింది. అయితే, ఇవే మక్కలకు అంతకుముందు రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ, తక్కువ ధర రావడంతో వాటిని రద్దు చేశారు. తొలి టెండర్లో గోదాముల వారీగా వేలం వేయగా సగం గోదాములకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. మిగిలిన గోదాములకు సగటున రూ.14,335 ధర పలికింది. ఆ తర్వాత రెండోసారి నిర్వహించిన టెండర్లో ఐదు లాట్లుగా విభజించగా సగటున రూ.14,010 ధర పలికింది. వీటిని కూడా రద్దు చేశారు. మూడోసారి 25 లాట్లుగా విభజించి టెండర్ వేయగా సగటు ధర రూ.19,337 పలికింది. అయితే నెల వ్యవధిలోనే రూ.14వేల నుంచి రూ.19వేలకు ధర పెరుగడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. మొదటి రెండు టెండర్లలో పాల్గొన్న బిడ్డర్లే మూడో టెండర్లలోనూ పాల్గొన్నారు. మూడో టెండర్లలో పౌల్ట్రీ వాళ్లు అదనంగా చేరారు. ఈ నేపథ్యంలో మూడు టెండర్లలోనూ పాల్గొన్న బిడ్డర్లు వారే అయినప్పటికీ తొలి రెండు టెండర్లలో ధర తక్కువ రావడం, మూడో టెండర్లో ధర ఎక్కువ రావడంపై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తొలి రెండు టెండర్లలో ఏదైనా గూడుపుఠాణి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.