మహబూబ్ నగర్ : వితంతు నుంచి లంచం డిమాండ్ చేసిన ఘటనలో తహసీల్దార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చిన్నచింతకుంట మండలం లాల్కోటకు చెందిన సతీష్ గతేడాది ఏప్రిల్ 26వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో సతీష్ పేరిట ఎకరా 7 గుంటల భూమి ఉంది. భర్త చనిపోవడంతో ఆ భూమిని తన పేరిట విరాసత్ చేయాలని మరికల్ తహసీల్దార్ శ్రీధర్ను మృతుని భార్య శ్రీశైల ఆశ్రయించింది. విరాసత్ చేసేందుకు మొదట రూ. 40 వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్ డిమాండ్ చేశారు.
తన వద్ద అంత డబ్బు లేదని, ఇండ్లలో పనిమనిషిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని బాధితురాలు శ్రీశైల తహసీల్దార్ శ్రీధర్ను వేడుకుంది. అయినా కరుణించని తహసీల్దార్ రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రూ. 25 వేలు ఇస్తానని ఒప్పుకుంది. అనంతరం ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. అయితే ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం.. బుధవారం తహసీల్దార్ శ్రీధర్కు రూ. 20 వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో ఉన్న తహసీల్దార్ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు.