Jagtial | జగిత్యాల కలెక్టరేట్, మార్చి 25: ప్రేమ పేరుతో బాలికను నమ్మించి గంజాయి అలవాటు చేసి లైంగికదాడి చేసిన ఇద్దరు యువకులతోపాటు ఓ బాలుడిని అరెస్ట్ చేసినట్టు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకనటలో తెలిపారు. తన కూతురిని గంజాయికి బానిస చేసి ముగ్గురు వ్యక్తులు లైంగికదాడి చేశారని బాలిక తండ్రి ఈ నెల 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపినట్టు చెప్పారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన ఆరెల్లి ప్రేమ్కుమార్, మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్ ప్రేమిస్తున్నామంటూ బాలికకు గంజాయి అలవాటు చేసి బలవంతంగా లైంగికదాడి చేశారు. అనంతరం వదిలేశారు. ప్రస్తుతం ఆ బాలిక పదో తరగతి మధ్యలోనే ఆపేసి ఇంట్లో ఉంటున్నది. అదే ప్రాంతంలో నివాసం ఉండే ఓ బాలుడు ప్రేమిస్తున్నానంటూ బాలికకు దగ్గరయ్యాడు.
బాలుడు కూడా బాలికకు మత్తుపదార్థాలు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి, చైల్డ్వెల్ఫేర్ అధికారులు, డీ అడిక్ట్ సెంటర్ వారి స్టేట్మెంట్ల ఆధారంగా చేపట్టిన విచారణలో.. ప్రేమ్కుమార్, వెంకటేశ్, బాలుడు వేర్వేరుగా బాలికకు మత్తుపదార్థాలు అలవాటు చేసి లైంగికంగా వాడుకున్నారని తేలిందని, దీంతో ఆ ముగ్గురిని అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. ప్రేమ్కుమార్, వెంకటేశ్ నుంచి 140 గ్రాముల గంజాయి, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని ముగ్గురిపై పోక్సో యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేశారు.
మీడియా సంయమనం పాటించాలి
సమస్య సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా సంయమనాన్ని పాటించాలని సీఐ సూచించారు. బాధితులకు సంబంధించిన ఐడెంటీని, సంబంధిత వ్యక్తుల వివరాలను ఏ రూపంలోనైనా బహిర్గతం చేస్తే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శిక్షార్హులవుతారని పేర్కొన్నారు.