వరంగల్ : వరంగల్ పోలీసులకు ఇద్దరు మావోయిస్టులు చిక్కారు. దండకారణ్య జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి, కొరియర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గడ్డం మధుకర్, వినయ్ కలిసి కొవిడ్ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు.
నిన్న మధ్యాహ్నం సమయంలో మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ములుగు నుండి ఓ వచ్చిన కారులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన దండకారణ్య స్పెషల్ జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్, కొరియర్ బందుగ వినయ్గా పోలీసులు గుర్తించారు. గడ్డం మధుకర్ ఇచ్చిన సమాచారం మేరకు 12 మంది కీలక నాయకులతో పాటు పార్టీ సభ్యులు కొవిడ్తో బాధపడుతున్నారని తెలిసింది.
గత పదిరోజుల క్రితం బీజాపూర్ సిల్దూర్ గ్రామం వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపును వ్యతిరేకిస్తూ ఛత్తీస్గడ్, తెలంగాణ రాష్ర్ట సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలతో మావోయిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సమయంలో కొవిడ్ లక్షణాలున్న ప్రజలను మావోయిస్టు నాయకులు, సభ్యులు కలవడంతో వారికి కరోనా సోకినట్లు తేలింది.