కొండపాక డిసెంబరు 17: మావోయిస్టు జగనన్న పేరుతో కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామ సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డికి శుక్రవారం బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో లక్ష్మారెడ్డి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి సర్పంచ్ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మారెడ్డికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మావోయిస్టు జగన్ పేరు చెప్పి.. పార్టీ ఫండ్ రూ. 20 లక్షలు కావాలని లక్ష్మారెడ్డిని డిమాండ్ చేశారు. సాయంత్రం 4:30 గంటల వరకు తమ పిల్లలు వస్తారని, వారికి డబ్బు ఇవ్వాలని సూచించినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. అంత డబ్బు తన వద్ద లేదని చెప్పగా.. నీ కుటుంబ నేపథ్యం మొత్తం తెలుసు అని చెప్పినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. రూ. 20 లక్షలు ఇవ్వకుంటే పరిణామాలు వేరే ఉంటాయని హెచ్చరించినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్పై త్రీ టౌన్ పోలీసులకు లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.