భూపాలపల్లి: మూడు రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్ట్ అగ్రనేత సిరిపెల్లి సుధాకర్ అలియర్ శంకర్రావు (Maoist Shankar Rao) మృతదేహం స్వస్థలానికి చేరింది. ఆయన భార్య సుమన అలియాస్ రజిత భౌతికకాయం కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చేరుకున్నాయి. వారిద్దరి అంత్యక్రియలను శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు వారి బంధువులు తెలిపారు.
ఈనెల 16న బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య భీరక కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. రాష్ట్ర చరిత్రలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదేనని పోలీసులు వెల్లడించారు. కాగా, శంకర్రావుపై రూ.25 లక్ష రివార్డు ఉన్నది.
ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించిన వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు భారీ ప్లీనరీకి సమాయత్తమవుతున్నట్లు పోలీస్ అధికారులకు సమాచారం అందింది. సీపీఐ(మావోయిస్టు) బస్తర్ డివిజన్ నేతలు శంకర్, లలిత, రాజు తదితరులు హాజరవుతున్నారని తెలిసింది. దీంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), జిల్లా రిజర్వు గార్డు(డీఆర్జీ), రాష్ట్ర పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా చోటేబేథియా పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బీనగుండా-కొరగుట్ట అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో సాయుధ మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగి, మావోయిస్టులను చంపేశారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటుగా భారీయెత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరుగుతున్న పోరులో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ రీజియన్లో ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు నెలల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు మరణించారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 2న బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 13 మంది నక్సలైట్లు మృతిచెందారు.
గత ఐదేండ్లలో జరిగిన ఎన్కౌంటర్లలో ఇదే అతిపెద్దదిగా తెలుస్తున్నది. 2018 ఆగస్టులో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. అదే ఏడాది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేల్-కస్నాసుర్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 40 మంది మావోయిస్టులు మరణించారు. మళ్లీ 2021 నవంబర్లో గడ్చిరోలిలో జరిగిన యాంటీ మావోయిస్టు ఆపరేషన్లో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2016లో 30 మంది నక్సలైట్లను గ్రేహౌండ్స్ బలగాలు చంపేశాయి.