హైదరాబాద్: మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఒట్టి బూటకమని మావోయిస్టులు (Maoist Party) ఆరోపించారు. హిడ్మా (Hidma) ఆచూకీ కోసం పోలీసులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించలేదని.. దారుణంగా హత్య చేశారని వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు అగ్రనేతలే దీని వెనుక ఉన్నారన్న ప్రచారాన్ని తోసిపుచ్చింది.
‘అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డిలు తమతోనే ఉన్నారు. వాళ్లు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పారనడం అవాస్తం. చికిత్స కోసం హిడ్మా విజయవాడకు వెళ్లారు. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణం. వారిలో కోసాల్ అనే వ్యక్తి ముఖ్యుడు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నీచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ ఇందుకు కారకులు. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా విజయవాడకు హిడ్మా వెళ్లారు. ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో హిడ్మాను పోలీసులు సజీవంగా పట్టుకున్నారు. ఆయనతోపాటు 12 మందిని పట్టుకుని హత్య చేశారు. హత్యలను కప్పప్పుచ్చుకునేందుకు మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లని కట్టు కథలు అల్లారు. హిడ్మాది హత్య.. ఏపీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్. మారేడుమిల్లి ఎన్కౌంటర్కు ప్రతీకారం తీర్చుకుంటాం. చనిపోయిన మావోయిస్టుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం.’ అని ఆ లేఖలో పేర్కొంది.