మిర్యాలగూడ రూరల్, మార్చి 26: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మావోయిస్ట్ నేత గజ్జెల సత్యంరెడ్డి 43 ఏండ్ల తర్వాత ఆదివారం సాయంత్రం తన ఇంటికి చేరుకున్నాడు. సత్యంరెడ్డి అలియాస్ గోపన్న మావోయిస్ట్ పార్టీ దండకారణ్య విస్తరణ కమిటీలో కీలక పాత్ర పోషించి కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. 26 ఏండ్లు అజ్జాతంలో, 17 ఏండ్లు జైలు జీవితం అనుభవించాడు. ఆయనపై పోలీసులు మోపిన అన్ని కేసులనూ న్యాయస్థానం ఒక్కొక్కటిగా కొట్టివేయడంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయపూర్ జైలు నుంచి విడుదలయ్యాడు.
స్థానిక ప్రజల సహకారంతో తనను తీసుకెళ్లడానికి వచ్చిన తమ్ముడు బుచ్చిరెడ్డితో కలిసి సొంతూరు చేరుకున్నాడు. ఇక రాడేమో అనుకున్న సత్యంరెడ్డి 43 ఏండ్ల తర్వాత కనిపించడంతో బంధువులు, గ్రామస్థులు కళ్లారా చూసుకొని ఆనందభాష్పాలు రాల్చారు. ఈ సందర్భంగా సత్యంరెడ్డి పుట్టిపెరిగిన ఊరిలో తిరిగి తాను ఆడుకున్న ప్రదేశాలను, మిత్రులను, పెద్దలను కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొన్నాడు. తాను జైలు జీవితం గడుపుతున్న సమయంలో తల్లిదండ్రులు మృతిచెందడంతో కడచూపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తోడపుట్టిన అన్న, తమ్ముడిని, కుటుంబ సభ్యులను కలిసినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.