హైదరాబాద్: గరియాబాద్ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ చనిపోయినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. చంద్రహాస్ ఒడిశాతోపాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్చార్జ్గా పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఆయనపై రూ.20 లక్షలకుపైగా రివార్డు ఉన్నది తెలిపారు. రెండు రోజుల క్రితం ఒడిశా-ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో దశాబ్దాల పాటు భద్రతా దళాలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న మావోయిస్టు అగ్రనేత జయరాం రెడ్డి అలియాస్ చలపతి కూడా ఉన్నారు. తాజాగా చంద్రహాస్ను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు.
చంద్రహాస్ అలియాస్ పాండన్న అలియాస్ ప్రమోద్ హైదరాబాద్లోని అల్వాల్కు చెందిన వారు. 1985లో గద్దర్ టీమ్లో కొంతకాలం పనిచేసిన చంద్రహాస్.. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రారంభంలో జననాట్య మండలిలో పనిచేశారు. గిరిజనుల పక్షాన నిలబడి వారికి సన్నిహితంగా ఉంటూ మాడ్ ఉద్యమానికి బీజం వేశారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు పార్టీ డీకేఎస్ జేడీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మాడీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పథకాలను పక్కాగా అమలు చేయడంలో ఆయనే కీలక పాత్ర పోషించేవారని తెలుస్తున్నది.