హైదరాబాద్ : అగ్నిపథ్ పథకం పేరుతో యువతరాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆరోపించారు. దేశాన్ని శాశ్వతంగా బంధీగా మార్చుకునేందుకు ఆర్ఎస్ఎస్ యత్నిస్తోందని, అందులో భాగంగా అగ్నిపథ్ స్కీమ్ను ప్రవేశపెట్టారన్నారు. ఈ మేరకు ఆదివారం అభయ్ ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదేళ్లలో ప్రజామోదం కలిగిన ఒక్క కార్యక్రమాన్ని కూడా మోదీ చేపట్టలేదని, వన్ నేషన్ – వన్ ఎవ్రీథింక్ నినాదంతో మోదీ దేశాన్ని ఫాసిస్టు ఏకీకృత పద్ధతిలో పాలిస్తున్నారని విమర్శించారు.
బీజేపీకి వ్యతిరేకంగా మేథావులు, కార్మికులు, కర్షకులు, పీడిత వర్గాలు, విప్లవపార్టీలు, ప్రశ్నించే గొంతుకలన్నీ ఒకే తాటిపైకి వచ్చేకాలం దగ్గరలోనే ఉందన్నారు. మోదీ ఒంటెత్తు పోకడలతో దేశం వందేళ్లు వెనక్కి నెట్టివేయబడుతున్నదని ఆరోపించారు. విపక్షాలతో చర్చించకుండా, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా అగ్నిపథ్ వంటి అతిపెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని అభయ్ ప్రశ్నించారు. దీంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్ ప్రవేశపెట్టడంలోని లోతైన అర్థాన్ని యువత అర్థం చేసుకోవాలని సూచించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా యువత కదలాలన్నారు. మేథావులు, కార్మిక, కర్షకలోకం యువతకు మద్దతుగా నిలువాలని అభయ్ ప్రకటనలో పిలుపునిచ్చారు.