హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): గురుకుల ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందించేందుకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్దఎత్తున గురుకుల విద్యార్థులను తరలించడంతో వారు నానా అగచాట్లు పడ్డారు. తమ చదువులో భాగంగా హయత్నగర్లో డాటా సైన్స్, లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటున్న వారందరితోపాటు అన్ని జిల్లాల నుంచి గురుకుల విద్యార్థులను గురువారం సీఎం సభకు అధికారులు తరలించారు. సీఎం సభలో జనం కనిపించేందుకు విద్యార్థులకు మధ్యాహ్నం 12 గంటలకే హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియానికి తరలించినట్టు విద్యార్థులు చెప్పారు. అప్పటి నుంచి మంచినీళ్లు, మజ్జిగ తప్ప ఎలాంటి భోజనం, అల్పాహారం కూడా ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు నకనకలాడారు.
పైగా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలానా వైపు టాయిలెట్లు ఉన్నాయనే బోర్డులు పెట్టకపోవడం, మొబైల్ టాయిలెట్ వెయికిల్స్ ఏర్పాటు చేయకపోవడంతో పంటి బిగువున సభ అయ్యేంత వరకూ విద్యార్థినులు ఓపికతో వేచి చూశారు. గేట్ నంబర్ 6లో ఉన్న ఒక్క టాయిలెట్ విద్యార్థినులతో కిక్కిరిసిపోయింది. దానిని శుభ్రం చేసే నాథుడు లేకపోవడం దుర్వాసలోనే ముక్కులు మూసుకుంటూ.. ఎటు వెళ్లాలలో తెలియక అమ్మాయిలు, ఉద్యోగాలకు ఎంపిక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసలు ముఖ్యమంత్రి మంత్రి సభకు.. గురుకుల విద్యార్థులకు సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.