IIIT H | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): దేశ ఐటీ రంగంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రగామి విద్యాసంస్థగా మారి, 25 ఏండ్లలో ఎన్నో మైలురాళ్లను దాటిందని విద్యాసంస్థ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 2తో 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ పురోగతిపై ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రారంభం నుంచి వ్యవస్థాపక చైర్మన్గా ఉన్న రాజిరెడ్డి.. కొత్త చైర్మన్గా నియమితులైన ప్రొఫెసర్ అశోక్ ఝున్ఝున్వాలా, డైరెక్టర్ పీజే నారాయణ్తో కలిసి వివరాలను వెల్లడించారు. ప్రారంభమైన నాటి నుంచి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ నగరంలోనే ఒక నాలెడ్జ్ హబ్గా మారిందని తెలిపారు.
ప్రొఫెసర్ పీజే నారాయణ్ మాట్లాడుతూ.. గచ్బిబౌలి ట్రిపుల్ ఐటీ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. టీ హబ్, సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఐఈ), 21వ శతాబ్దపు గురుకులాలు, ఆర్జీయూకేటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నెన్స్ వంటి రాష్ట్ర, జాతీయ సంస్థల ఏర్పాటులో కీలకంగా పనిచేసిందని చెప్పారు. డేటా ఆధారిత పరిశోధన ర్యాంగింగ్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా, ఆసియాలో 30వ స్థానంలో, ప్రపంచ స్థాయిలో 102వ స్థానంలో ఉందన్నారు. 800 మంది పూర్వ విద్యార్థులు మైక్రోసాప్ట్లో, 900 మంది చొప్పున గూగుల్, అమెజాన్లలో ఉద్యోగులుగా ఉన్నారని, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగారని వివరించారు.