హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): యూజర్ ఫ్రెండ్లీ ఉండేలా టీఎస్బీపాస్లో అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇల్లు, బిల్డింగ్ల ఓనర్లు సులువుగా, సులభంగా అనుమతులు పొందేందుకు సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇంటి ఓనర్లకు మరింత అనువైన విధానాలను తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా కట్టే అపార్ట్మెంట్లు, భారీ భవనాలు, కమర్షియల్ భవనాలకు ఫైర్ అధికారుల నుంచి ఎన్వోసీ తీసుకోవాలి. వాటి కోసం వారి కార్యాలయాల చుట్టూ తిరిగాలి. దీనికి పరిష్కారంగా ఫైర్ అనుమతులూ టీఎస్బీపాస్ ద్వారానే ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని తీసుకరానున్నారు. అలాగే, మార్ట్గేజ్ ప్లాట్ సేల్ డీడ్లను కూడా బీపాస్ ద్వారా తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్ట్గేజ్ ప్లాట్ సేల్ డీడ్ కోసం రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ, ఈ అవసరం లేకుండా బీపాస్ విధానంలోనే పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నది. దీనితో పాటుగా టీఎస్బీపాస్లో దరఖాస్తుదారుడి వివరాలను సవరణ చేసుకోవడానికి గతంలో అవకాశం లేదు. చిన్నచిన్న తప్పులు జరిగినా ఆ దరఖాస్తులను తిరస్కరించాల్సి వచ్చేది. కానీ దరఖాస్తు వివరాలను ఒకసారి సవరణ చేసేందుకు బీపాస్లో అవకాశం కల్పించారు. దీని ద్వారా తిరస్కరణలకు అవకాశం తగ్గుతుంది. ఇంటి ఓనర్లు చేసే చిన్నచిన్న పొరపాట్లను సరిచేసుకోవచ్చు. డాక్యుమెంట్లు తక్కువగా ఉండటం, వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయకపోవడం తదితర వాటిపై తిరస్కరణకు అవకాశం ఉన్న వాటిని తిరస్కరించకుండా షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నారు. నోటీసులో చూపించిన విధంగా ఇంటి యజమాని వాటిని పూర్తి చేస్తే వాటికి అనుమతులు ఇవ్వనున్నారు. ఒక వేళ సరిగా వివరాలు అందించకుంటే వాటిని తిరస్కరిస్తున్నారు. దీని ద్వారా తిరస్కరణకు గురయ్యే దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ఇలా పలు మార్పులు సులువైన విధానాలను తీసుకవస్తున్నారు.